Skip to content

శ్రీ జోగులాంబ  దేవి - 5వ శక్తి పీఠం - అలంపురం (తెలంగాణ)

జోగులాంబ ఆలయం కర్నూలు పట్టణము కు సమీపంలోని అలంపురంలో ఆగ్నేయదిశగా నెలకొని ఉంది.

పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని, దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరండం, ఆ జీవ కళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం. ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపం అని, అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పేర్కొనడం అనాదిగా వస్తోంది. వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.

జోగులాంబ ఆలయాన్ని 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు ధ్వంసం చేయగా, జోగులాంబ, చండి, ముండి విగ్రహాలను బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో భద్రపర్చారు. కొద్ది సంవత్సరాల క్రితం జోగులాంబ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన (ఐదవ శక్తిపీఠం) జోగుళాంబ ఆలయం ఉంది. అమ్మవారిపై దవడ పంటితో ఇక్కడ పడినట్టు పురాణకథనం. జోగులాంబ మహాదేవి, రౌద్ర వీక్షణ లోచన, అలంపురం స్థితమాత, సర్వార్థ ఫల సిద్ధిద అని జోగులాంబ దేవిని ప్రార్థిస్తారు. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ, ఆలయంలో గల కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉండేది. 2008 లో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం చేసి అమ్మవారిని అక్కడకు తరలించారు. బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉన్నప్పుడు అమ్మవారిని కిటికీ గుండా చూసేవారు.

9 వ శతాబ్దానికి చెందిన సూర్యనారాయణస్వామి దేవాలయం కూడా ఇదే ప్రాంగణంలో ఉంది. ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన సుందరమైన విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ విజయనగర రాజు అయిన కృష్ణదేవరాయలకు చెందిన ఒక నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. అలంపూర్ దగ్గరలో పాపనాశనం అను ఇరవైకి పైబడిన శివాలయములు వివిధ ఆకారం, పరిమాణాలలో ఉన్నాయి. ఇందులో పాపనాశేశ్వర దేవాలయం ప్రధానమైనది.

ఈ శక్తిపీఠాన్ని సందర్శించడానికి వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు.

ఈ దేవాలయాన్ని ఒక్క సారి సందర్శిస్తే మన దురదృష్టం వెళ్లి పోయి అదృష్టం కలుగుతుందని భక్తులు నమ్ముతారు

🌺🙏🌺🙏🌺

శ్రీ చాముండేశ్వరి దేవీ - 4వ శక్తి పీఠం - మైసూరు (కర్ణాటక)

18 శక్తి పీఠాల్లో నాలుగోది అయిన శ్రీ చాముండేశ్వరి శక్తిపీఠం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు పట్టణము లో ఉన్నది. ఈ పీఠము లో సతీదేవి తల వెంట్రుకలు పడ్డాయంటారు. ఈ శక్తి పీఠంలో అమ్మవారు దుష్ట సంహారిణిగా, మంగళదాయినిగా, జగన్మాతగా కొలువై ఉంది.

శ్రీ చాముండేశ్వరి దేవీ అన్ని కార్యాలను విజయవంతం చేస్తుందని విశ్వాసం. మైసూరు రాజుల ఇష్టదైవమైన ఈ ఆలయంలో దసరా ఉత్సవాలను వైభవంగా చేస్తుంటారు. ఈ ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు.

ఆలయ చరిత్ర:

ప్రాచీన కాలంలో ఈ ప్రాంతానికి క్రౌంచపట్టణమని పేరుండేది. అశోకుని కాలంలో ఈ ప్రాంతాన్ని మహిషాసుర మండలమని పిలిచేవారు. ఆధునిక కాలంలో మైసూరు ప్రాంతాన్ని పరిపాలించిన ఉడైయార్ (రాజవంశరాజు) ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. 1895-1940 కాలంలో ఈ దేవాలయం బాగా అభివృద్ధి చెందింది. ఆ కాలంలో చాముండేశ్వరి ఆలయం అత్యంత సుందరమైన ఆలయంగా రూపొందింది.

ప్రచారంలో ఉన్న పురాణ కథ:

పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు కఠోర తపస్సుచే పురుషుల చేతుల్లో మరణించకూడదని పరమేశ్వరుని నుంచి వరాన్ని పొందుతాడు. ఆ వరం పొందిన గర్వంతో సకలలోకాలను పీడించాడు.

ఇంద్రుని జయించి స్వర్గాన్ని కూడా ఆక్రమిస్తాడు. భయభ్రాంతులైన సకలలోకవాసులు త్రిమూర్తులను వేడుకోగా, మహిషాసురుని వధించుటకై శక్తి వెలికివచ్చింది. ఆ శక్తి స్వరూపిణియే చాముండేశ్వరి. 18 చేతులతో ప్రతిచేతిలో ఒక ఆయుధంతో ఆ తల్లి దర్శనమిస్తుంది. మహిషాసురుని వధించి మహిషాసురమర్దినిగా సకలలోక వాసుల కీర్తనలను అందుకుంటుంది.

ఈ శక్తిమాతను దర్శించుకుంటే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంకా సకల సంపదలు, వ్యాపారాభివృద్ధి, ఆయురారోగ్యాలను చాముండేశ్వరి ప్రసాదిస్తుందని విశ్వాసం.

అమ్మ చాముండేశ్వరి దేవీ, “చాముండి కొండ” అనబడే ఒక పర్వతము పై కొలువై ఉంటుంది.

‘స్కంద పురాణం' మరియు ఇతర పురాతన గ్రంథాలు ఈ క్షేత్రాన్ని ఎనిమిది కొండల చుట్టూ ఉన్న 'త్రిముత క్షేత్రం' అనే పవిత్ర ప్రదేశం అని ప్రస్తావించాయి. ఆ ఎనిమిది కొండలలో ఒకటైన ఈ చాముండి కొండ పశ్చిమ దిశలో ఉంటుంది. పూర్వ రోజులలో, ఈ కొండ పై వెలసిన మహాబలేశ్వర స్వామి) గౌరవార్ధం, ఈ కొండను 'మహాబలద్రి' అని అనేవారు.తరువాతి రోజులలో, “దేవి మహత్యం” యొక్క ప్రధాన దేవత చాముండి గౌరవార్థం 'చాముండి కొండా అని పిలువబడింది.

దేశం నలుమూలల నుంచి మరియు విదేశాల్లో నుండి అనేకమంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. దేవత వారి కోరికలను నెరవేర్చును.

🌺🙏🌺🙏🌺

శ్రీ శృంఖలా దేవి - 3వ శక్తి పీఠం - ప్రద్యుమ్న (పశ్చిమ బెంగాల్)

శ్రుంఖలము అనగా బందనం అని అర్థము. బాలింత కట్టుకొనే నడి కట్టుని కూడా శ్రుంఖళ అనవొచ్చు. అమ్మవారు జగన్మాత కాబట్టి ఇక్కడ ఒక బాలింత రూపము లో నడి కట్టు తో ఉంటారు. అందువలనే శ్రుంఖలా దేవి అని పేరు వచ్చింది అని అంటారు.

మరికొందరు ఈ దేవి ని విశృంఖల అని కొలుచుకుంటారు. విశృంఖల అంటే ఎటువంటి బంధనాలు లేని తల్లి అని అర్థము.

సమస్త జగత్తను కన్న తల్లి గా, బాలింత నడి కట్టు తో అలరారే ఈ తల్లి నీ శాంతా సమేతముగా రుష్య శ్రుంగ మహర్షులవరు పూజించారు అని, అమ్మ వారి పూజకు మెచ్చి అనుగ్రహించింది అని అంటారు. ఆ ఋషి పేరు మీదగా శ్రుంఖల అని అమ్మ పేరు అని కొందరు అంటారు.

అమ్మ వెలసిన క్షేత్రము ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. మధ్యయుగ దండయాత్ర సమయంలో, ఈ ఆలయం ధ్వంసం చేయబడింది మరియు దాని స్థానంలో ఒక మినార్ నిర్మించబడింది. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.

🌺🙏🌺🙏🌺

శ్రీ కామాక్షి దేవీ - 2వ శక్తి పీఠం - కాంచీపురం

అష్టాదశ శక్తి పీఠాలలో రెండవది కంచిలోని కామాక్షీదేవి ఆలయం . కంపా నదీ తీరంలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు శక్తి స్వరూపిణి.. భక్తుల మనోభీష్టాలు నెరవేర్చే అమ్మగా ఆమె ఇక్కడ విలసిల్లింది. ఇక్కడే శ్రీ మహావిష్ణువుతో పాటు దేవతలంతా తమతమ నెలవులను ఏర్పరచుకొన్న పుణ్యపావన క్షేత్రం ఈ శక్తి పీఠం. శ్రీ కామాక్షి దేవి ని 'కామాక్షి తాయి' అని 'కామాక్షి అమ్మణ్ణ్ ' పిలుస్తారు.

పూర్వం ఇక్కడ ఉండే బంగారు కామాక్షి దేవి, ఇప్పుడు తంజావూరులో కొలువుదీరి ఉన్నారు. కాంచీపురంలో భగవత్ శ్రీఆదిశంకరాచార్యులుచే స్థాపించబడిన కంచి కామకోటి పీఠం ఉంది. శ్రీకామాక్షిదేవి ఆలయం ప్రక్కనే కంచి కామకోటి పీఠం ఉంది.

“కా” అంటే “లక్ష్మి”, “మా” అంటే “సరస్వతి”, “అక్షి” అంటే “కన్ను”. కామాక్షి దేవి అంటే లక్ష్మి దేవి మరియు సరస్వతి దేవి ని కన్నులుగా కలది. సోమస్కంద రూపంగా శివ (ఏకాంబరేశ్వర్) , ఉమ (కామాక్షి) మధ్యలో స్కంధుడు (కుమారస్వామి) కొలువుదీరి ఉన్నారు.

చెన్నైకి 70 కి.మీ. దూరంలో గల కంచిక్షేత్రాన్ని కాంచీపురం, కాంజీవరం అని కూడా పిలుస్తారు. చెన్నైనుండి తాంబరం మీదుగా కంచి చేరవచ్చు. దేవాలయాల కేంద్రంగా.. విశిష్ఠ విద్యాకేంద్రంగా గల ఈ కంచిపురంలో సతీదేవి “కంకాళం” పడినట్లు చరిత్రకారుల నమ్మకం.

కామాక్షి అమ్మవారు విగ్రహం యోగముద్రలో పద్మాసనముపై ఆసీనురాలై శాంతిని, సౌభ్రాతృత్వాన్ని వెల్లివిరిస్తూ ఉంటుంది. అమ్మవారు క్రింది హస్తాలతో చెఱకుగడ, పుష్పాలు మరియు చిలుకను, పై చేతులతో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటుంది.

కంచి పట్టణంలో కామాక్షి అమ్మవారి దేవాలయం కాకుండా వేరే అమ్మవారి దేవాలయాలు లేవు. కామాక్షివిలాసం అనే ఇతిహాసం ప్రకారం ఇక్కడ అమ్మవారు శక్తి అంతా గ్రహించింది అని , మరో ఇతిహాసం ప్రకారం రాజరాజేశ్వరి ఆసనంలో ఉండటం వల్ల ఈ అమ్మవారు సృష్టిలో ఉండే అన్ని శక్తులమీద తన ప్రభావం చూపుతుందని చెబుతారు.

స్థల పురాణము:

కామాక్షి అమ్మవారు మామిడి చెట్టు క్రింద మట్టితో శివలింగాన్ని ప్రతిష్టచేసి ఈశ్వరుని పాణి గ్రహణం చేయుటకు ఘోర తపము చేసిందని చెబుతారు. శివుడు పెట్టిన అనేక పరీక్షలకు నిలిచి, ఆయనను మెప్పించి పరిణయమాడినది .

మొదట ప్రసన్నంగ ఉన్న అమ్మవారు, తరువాత కొన్ని పూజా పద్దతులలో వచ్చిన మార్పులు వల్ల చాలా ఉగ్రంగా ఉండి బలులు తీసుకొంటూ ఉంటే ఆదిశంకరాచార్యులు అమ్మవారి పూజా పద్ధతిని సవరించి, అమ్మ ను శంతపరచి, శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు.

భగవత్ శ్రీ ఆది శంకరాచార్యులు కామాక్షి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం విడిచి వెళ్ళవద్దని అభ్యర్ధించిన కారణంగా, ఉత్సవ కామాక్షి, ప్రాంగణంలోనే ఉన్న శ్రీ ఆది శంకరాచార్యులు అనుమతి తీసుకొని, ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుంది.

ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొనిఉంది. ఇక్కడ ప్రతిరోజూ ప్రాతఃకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవ మూర్తిని మేలుకొలిపి, ప్రాతఃకాల నైవేధ్యం సమర్పించి హారతి ఇచ్చి, కామాక్షిదేవి ఉత్సవ మూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత కామాక్షి దేవి కి ఎదురుగా గోపూజ చేస్తారు. గోపృష్ట భాగం అమ్మవారి వైపు ఉంచి గోపూజ చేస్తారు. గోపూజ అయిన తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలిగించి హారతి యిస్తారు. మనం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు.

శ్రీ కామాక్షి దేవి దివ్య మంగళ రూపం నయన మనోహరంగా ఉంటుంది. ఇంకా ఈ ఆలయంలో వారహి అమ్మవారు, అరూప లక్ష్మి, రూప లక్ష్మి, వినాయకుడు, కల్వనూర్(విష్ణువు), అర్ధనారీశ్వర, అన్నపూర్ణ, రాజ శ్యామలా దేవి, క్షేత్రపాలకుడు అయిన పూర్ణ పుష్కల సమేత ధర్మ శాస్త, కామాక్షి దేవి పూజ పద్ధతిని తొలుత నిర్ణయించిన దుర్వాస మహర్షి, ఆ పద్ధతిని పునః ప్రతిష్ట చేసిన ఆది శంకరులను దర్శనం చేసుకోవచ్చు.

ఈ దేవాలయ ప్రాంగణంలో కుంభస్థలంపై అందంగా అలంకరించబదిన ఏనుగులను కూడా చూడవచ్చు. ఇక్కడ ఉన్న పంచ తీర్థం అనే కోనేరు చాలా విశాలంగా ఉంటుంది. ఈ ఆలయ శిల్పసంపద చాలా రమణీయంగా ఉంటుంది.

🌺🙏🌺🙏🌺

శ్రీ శాంకరీ దేవీ - ప్రథమ శక్తి పీఠం - శ్రీ లంక

స్థల పురాణము

లంకాధీశుడైన రావణాసురుడు కైలాసం నుంచి పార్వతీదేవిని తన రాజ్యమునకు తీసుకు వెళ్ళాలని భావించి, కైలాసమునకు వెళ్ళి బలవంతంగా పార్వతీ దేవిని తీసుకువెళ్ళే ప్రయత్నం చేయగా, కోపోద్రిక్తురాలైన పార్వతీదేవి రావణాసురుడిని అస్త్రబంధనం చేసింది. దీనితో బలగర్వం నశించిన రావణాసురుడు పార్వతీదేవిని అనేక రకాలుగా భక్తితో ప్రార్థించాడు. రావణాసురుని భక్తికి మెచ్చిన పార్వతీదేవి ప్రసన్నమై వరం కోరుకోమనగా – తన రాజ్యంలో కొలువుదీరి తనను, తన ప్రజలను, రాజ్యమును రక్షిస్తూ వుండమని వరం కోరాడు. అందుకు పార్వతీదేవి –

“రావణా! నీవు అనేక అకృత్యాలు చేస్తున్నావు. అందువల్ల నీ రాజ్యం సముద్రంలో మునిగిపోయి కుచించుకుపోతుంది. నీకు వరం ప్రసాదించి నేను వచ్చి నీ రాజ్యంలో వుంటాను. అయితే నీవు అకృత్యాలు చేయనంతకాలం నేను నీ రాజ్యంలో వుంటాను. నీవు మళ్ళీ అకృత్యాలు చేసిన మరుక్షణం నేను నీ రాజ్యం వదిలివెళ్తాను. నేను వెళ్ళిన తర్వాత నీకు కష్టాలు ప్రారంభమై, నీ పాలన అంతమొందుతుంది.” అని పలికింది.

అందుకు రావణాసురుడు అంగీకరించగా – పార్వతీ దేవి లంకారాజ్యంలో శాంకరీదేవిగా కొలువుదీరి ఆరాధనలందుకో సాగింది.

తర్వాత కొంత కాలానికి రావణాసురుడు సీతాదేవిని తీసుకొనివచ్చి అశోకవనంలో బంధించాడు. ఆ మరునాడు శాంకరీదేవి దర్శనమునకు వెళ్ళి రావణాసురునితో –

“రావణా! సీతాదేవిని బంధించి నీవు తప్పు చేశావు. నీవు ఆమెను వదిలిపెట్టు. లేదంటే నేను నీ రాజ్యం వదిలి వెళ్ళిపోతాను” అని పలికింది.

శాంకరీ దేవి మాటలను రావణాసురుడు ఖాతరు చేయక పోవడంతో లంకను వదిలి వెళ్ళిపోసాగింది. ఈ సమయంలో మహర్షులు లంక వదిలివెళ్ళినా భూలోకం వదలి వెళ్ళవద్దని ప్రార్థించడంతో ఆదేవి దక్షిణం నుంచి ఉత్తరమునకు సాగిపోయి హిమాలయం, కాశ్మీరం మొదలైన క్షేత్రాలలో నిలబడిపోయిందని చెప్తారు. మహర్షులు ఆ దీవిని “బనశంకరీ” అని పిలిచారు. ఆ విధంగా దేవి వెళ్ళిపోవడంతో శక్తిపీఠం కాలగర్భంలో కలిసిపోయిందని భావిస్తారు.కొందరు రావణ సంహారానంతరం శాంకరీ దేవీ తిరిగి లంకలో మహర్షులు చేత ప్రతిష్ఠించబడింది అని భావిస్తారు.

అయితే అనేక వివాదాలు ఉన్న ప్రస్తుతం శ్రీలంక దేశంలోని “ట్రింకోమలి” పట్టణంలో వున్న దేవీ ఆలయమును ప్రథమ శక్తి పీఠంగా భావిస్తున్నారు. ఈ క్షేత్రంలో సతీదేవి కాలిగజ్జెలు పడినట్లు చెప్పబడుతోంది.

శ్రీ శాంకరీ దేవి ఆలయం ,శ్రీలంక తూర్పు ప్రాంతం లోని కోనేశ్వరం లో త్రిముకోమలై వద్ద వుందని చెప్పబడుతుంది . దానినే కొనేశ్వరం శాంకరీదేవి ఆలయంగా కూడా పిలుస్తారు .

అయితే ప్రస్తుతం, ఈ ప్రదేశంలో .. ఏ ఆలయం లేకపోయినా, శ్రీ శాంకరీ దేవి ఆలయం ఖచ్చితంగా వున్నదని చెప్పినచోట, అది వున్నట్లు చూపే గుర్తుగా, ఒక స్తూప స్థంబాన్ని కొండ శిఖరం మీద నిర్మిచారు.

ఈ ఆలయాన్ని 16 -17 శతాబ్దం మధ్య పోర్చుగీస్ వారు నాశనం చేశారు. చరిత్ర ఆధారంగా 17 వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు ఈ ద్వీపాన్ని ముట్టడించారు. కొండ శిఖరం పైన వున్న ఈ ఆలయాన్ని వారి ఓడ నుండే ఫిరంగులతో దాడి చేసి పూర్తిగా నాశనం చేశారు.

అయితే, శాంకరీ దేవి విగ్రహాన్ని, ఆలయం వున్నదని చూపిన స్థలం ప్రక్కనే, ఇప్పుడు ఉన్న శ్రీ త్రికోనేశ్వర (శివ) స్వామి ఆలయంలో భద్రపరచ బడిందని భక్తుల విశ్వాసం.

ఇటీవల నిర్మాణం చేసిన ఈ ఆలయాన్ని, శాంకరీ దేవి ఆలయంగా కంటే కూడా, స్థానికులు శివాలయం గానే భావిస్తారు.

త్రిముకోమలై అంటే “త్రిభుజం ఆకారంలో” వున్న “కొండ” పై ఉండటం వల్ల - ఆ దేవుణ్ణి శ్రీ త్రికోనేశ్వర స్వామిగా పిలుస్తారు.

ఆ శివాలాయం ప్రక్కనే… ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు.. ఆ ఆలయంలోని కొలువైవున్న దేవినే శాంకరీ దేవిగా కొలుస్తున్నారు

🌺🙏🌺🙏🌺